jQuery(document).ready(function($){$('#aside #lang_sel_list ul').addClass('fancy');});

Your browser (Internet Explorer 7 or lower) is out of date. It has known security flaws and may not display all features of this and other websites. Learn how to update your browser.

X

Navigate / search

శ్రీరమణాశ్రమము

ఆశ్రమం వెంటనే రూపుదిద్దుకోలేదు సుమా! మొదట అమ్మ సమాధిపై ఒక తాటాకు (కొంజా) పందిరి ఉండేది. క్రమేపీ, దాతల సహకారంతో శాశ్వత నిర్మాణములు మొదలై రమణులు కూర్చుండే హాల్‌ ధ్యానమందిరం, ఆఫీసు, పుస్తకాలయం, ఆసుపత్రి, అతిథి గృహం, రెండు చిన్న బంగళాలు రూపొందాయి. ఆశ్రమంలో అనుమతి మగవారికి పరిమితమై ఉండేది. స్త్రీలు సాయంత్రం ఊరిలో మకాం చూసుకొనేవారు. ఆశ్రమానికి, కొండకు మధ్య పల్లాకొత్తు అనే తోపులో కొందరు సాధు పుంగవులు నివాసాలు ఏర్పరుచుకున్నారు. కామధేను అపర అవతారమైన గోవు లక్ష్మి ఆగమనంతో ఆశ్రమం నవ్యశోభ సంతరించుకొంది. ఆమెకొరకు గోశాల ఏర్పాటు కాగా అది క్రమాభివృద్ది చెందింది. గో సంపద సమకూర్చే పాడితో ఆశ్రమ సందర్శకుల, నివాసకుల సందడి దినాదినాభివృద్ధి కాగా, ఆశ్రమం ఒక ఆధ్యాత్మ కేంద్రమే కాక, అన్నక్షేత్రం కూడా అయింది. గోసంరక్షణ, సాధుపోషణ రమణుల ప్రియ కార్యాలయ్యాయి. కాలక్రమంలో ఆగమోక్త విధానంలో నిర్మితమైన శ్రీమాతృభూతేశ్వరాలయం అళగమ్మ సమాధిపై సుప్రతిష్ఠమైంది. మహాలింగం, రెండు శ్రీచక్రాలకు నిత్యపూజలు కొనసాగుతున్నాయి నేటికీ.

Samadhi Shrine
Samadhi Shrine

ప్రత్యేకతను రమణులు ఆమోదించేవారు కారు. ఈ విషయాన్ని భోజనాల వద్ద నొక్కి వక్కాణించేవారు. ఔషధాలుగానీ, టానిక్‌వంటి బలవర్ధకాల విషయాలలో గానీ ఇదే నియమం పాటిస్తూ, అన్నీ అందరికీ సమంగా అందేలా చూసేవారు. ఈ విషయంలో వారికి వారే సాటి. అంతేకాదు. ఆశ్రమ నిర్వహణలో ఎన్నడూ కల్పించుకోరు. నిర్వాహకుల నియమావళిని పాటించడానికి ఆయనే ముందుండేవారు, కానీ వారెన్నడూ నియమావళిని ఏర్పరచేవారు కారు. వారి లీలాకార్యం కేవలం ఆధ్యాత్మికం – తమ ఆశ్రయంలోకి నిత్యం వచ్చిచేరే సాధక శ్రేణులకు మౌనంగా మార్గదర్శనం చేయడం. చిన్నస్వామిగా పిలువబడే రమణుల తమ్ముడు నిరంజనానంద స్వామి ఆశ్రమ నిర్వాహకులు లేక సర్వాధికారి. నిత్యం మహర్షి సన్నిధిన జరిగే సత్సంగానికి వేదిక – ధ్యానమందిరం (పాతహాల్‌). ఆధ్యాత్మ క్రియాశీలకమైన ఈచోటు స్వామి కరుణతో అలరారుతుంది. వారి కన్నులు అలౌకిక ప్రేమతో తొణికిసలాడుతూ, ఆవశ్యకమైన మధుర గంభీర వాక్కులతో అభ్యాసకులకు ఉద్దీపన కల్గించేవి. ఒక క్రమపద్ధతిలోనో, సమయంలోనో ధ్యానాదులు చేయాలనే పట్టింపులేదు. తొలినాళ్ళలో తలుపులు సందర్శకులకు ఎప్పుడూ తెరచి వుండేవి. రాత్రులు కూడా భక్తులు వచ్చి స్వామిని దర్శించేవారు.

భక్తులకు తామెప్పుడూ అందుబాటులో ఉండాలన్నదే వారి ఆశయం. అందుకోసం ఎక్కువ ఎక్కడికీ వెళ్ళేవారు కారు. పగలు, సాయంత్రం కొంచెంసేపు కొండమీదకో, పల్లాకొత్తుకో వెళ్ళే విహారాలు మినహా. తొలిరోజుల్లో తరచు గిరిప్రదక్షిణ చేసేవారు. భక్తుల సంఖ్య, సత్సంగ సమయాలు పెరిగిన కొద్దీ క్రమేపీ మానుకున్నారు.

1949లో మహర్షుల ఎడమ మోచేతిపై సార్కొమా (క్యాన్సర్‌) వచ్చింది. ఎన్ని వైద్యాలు చేసినా లొంగక, ఏప్రిల్‌ 14, 1950న వారి భౌతికయాత్రకు అంతిమ ఘడియ సమీపించింది. ఆనాడు సాయంత్రం మాతృభూతేశ్వరాలయం ఎదుట ప్రస్తుతం నిర్వాణ రూమ్‌గా పిలిచే గది వరాండాలో భక్తులంతా కూచుని స్వయంస్ఫూర్తితో ‘అరుణాచల శివ’ అంటూ రమణులు రాసిన ‘అక్షర మణమాల’ను ఎలుగెత్తి అరుణగిరిని నినదించారు. గదిలో కనులు మూసి పడుకొన్న రమణుల నేత్రాలు ఆనంద భాష్పాలతో విప్పారాయి. అనిర్వచనీయమైన మార్దవాన్ని వెదజల్లే చిరునవ్వు చిందించింది వారి మోము. కనుకొలుకులనుండి ధారగా భావాశ్రువులు. ఒకే ఎగశ్వాస …. అంతే …. నిశ్శబ్దం!

అది రాత్రి 8.47 సమయం. ఒక పెద్ద కాంతిగోళం దక్షిణంగా ఆకాశంలో మెరసి, నెమ్మదిగా ఈశాన్యదిశగా పయనించి అరుణశైల శిఖరంలో అంతర్హితమైంది. బొంబాయి, శ్రీలంక వంటి సుదూర ప్రాంతాలకు కూడా కనిపించిందీ దివ్యజ్యోతి. మహర్షుల భౌతిక యాత్ర ముగింపుకు ఇది సుస్పష్ట సంకేతమని ఎలుగెత్తి చాటారంతా!

రమణుల ఆధ్యాత్మిక శక్తివిలాసం వారి దేహయాత్ర అనంతరం క్షీణించకపోగా నానాటికీ ఉజ్జ్వలంగా భాసిస్తోంది. తమ ఆధ్యాత్మ ప్రగతి కోసం వారు ఇంకొన్నాళ్ళు తమ జీవితాన్ని పొడిగించుకోవాలని భక్తులు ప్రార్థిస్తే, ”పోతానా? నేనెక్కడికి పోయేది, ఇక్కడే ఉంటానెప్పుడూ” అంటూ ధీమగా చెప్పేవారు. దాని అర్థమిదే.

Optimization WordPress Plugins & Solutions by W3 EDGE